విజయారెడ్డి డ్రైవర్ కూడా మృతి !

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాద వార్త. ఆమెని కాపాడటానికి వెళ్లి తీవ్ర గాయాలైన డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం సురేశ్ తహసీల్దారు విజయారెడ్డి గదిలోకి వెళ్లి.. తలుపులు బిగించి.. ఆమెకు నిప్పంటించిన సమయంలో తొలుత తలుపులను పగులగొట్టి లోనికి దూసుకెళ్లింది గురునాథమే. విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాథం కు 80 శాతం కాలిపోయారు. 

ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందాడు. సూర్యాపేటకు చెందిన గురునాథం గత ఎనిమిది యేళ్లుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య గర్భవతిగా ఉంది. గురునాథం మృతితో ఆయన కుటుంబం బోరున విలపిస్తోంది.