మణిరత్నం మల్టీస్టారర్ తొలి షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారట !

మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది ఆయన సినిమా. ఆణిముత్యాలాంటి సినిమాలు అందిస్తుంటారు. ఆ మధ్య కాస్త ట్రాక్ తప్పినట్టు కనిపించినా..’ఓకే బంగారం’తో తిరిగి ఫామ్ లోకి వచ్చేశారు. మ‌ణిర‌త్నం గతచిత్రం ‘సెక్క సివంద వానం’ సూపర్ హిట్ అయ్యింది. ఆయన తాజా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. కల్కి విరచిత పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇదో భారీ మల్టీస్టారర్. విక్రం, జయంరవి, కార్తి, మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్, కీర్తిసురేష్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా తొలి షెడ్యూల్ థాయ్ లాండ్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీనికోసం డిసెంబరు తొలి వారంలోనే తన బృందంతో కలిసి మణిరత్నం థాయ్ లాండ్ వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కల్కి విరచిత పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా సినిమా చేయాలన్నది ఎంజీఆర్ వంటి పలువురు ప్రయత్నించారు. కానీ చేయలేకపోయారు. ఇప్పుడు మణిరత్నం ఆ నవలని వెండితెరపైకి తీసుకొస్తున్నారు.