శ్రీశైలం డ్యామ్ ప్రమాదమేమీ లేదు.. !

శ్రీశైలం ప్రాజెక్టుకు పెనుముప్పు పొంచి ఉందని వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. డ్యామ్ కు ప్రమాదం వాటిల్లితే ఏపీలో సగభాగం కనిపించకుండా పోతుందని ఆయన ముందస్తు హెచ్చరికలు చేశారు. దీంతో శ్రీశైలం డ్యామ్ భద్రతపై విస్తృత చర్చజరుగుతోంది. తాజాగా శ్రీశైలం డ్యామ్ భద్రతపై శ్రీశైలం ప్రాజెక్టు సూపరింటిండెంట్ ఇంజినీరు చంద్రశేఖర్ రావు స్పందించారు. 

శ్రీశైలం డ్యామ్ భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదని, ప్రాజెక్టు ఎంతో సురక్షితమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే డ్యామ్ తాజా పరిస్థితిపై ప్లంజ్ పూల్ సర్వే నివేదికలు వస్తాయని, వాటిని డ్యామ్ సేఫ్టీ కమిటీకి సమర్పిస్తామని వెల్లడించారు. రిజర్వాయర్ భద్రతపై ఇప్పటికే సీడబ్ల్యూసీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రజలు ఎవరు శ్రీశైలం డ్యామ్ పై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. మరీ.. నిజంగానే శ్రీశైలం డ్యామ్ నుంచి ప్రమాదం లేదా.. ? కొత్త సర్వేలు వచ్చిన తర్వాత అసలు నిజం తెలుస్తుందా ? అనేది చూడాలి.