‘హెచ్‌సీఏ’పై కేటీఆర్ కు రాయుడు ఫిర్యాదు

టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో (హెచ్‌సీఏ) అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘంలో అవినీతి కట్టడి చేయాలని మంత్రి కేటీఆర్ కు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. క్రికెట్‌ పాలకులలో చాలామందిపై ఏసీబీ కేసులు నడుస్తోంటే రాష్ట్రంలో క్రికెట్‌ ఎలా ఎదుగుతుందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.

‘హల్లో.. కేటీఆర్‌ సర్‌. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి వైపు దృష్టిసారించాలని, దానిని నిర్మూలించాలని కోరుతున్నా. అవినీతి పాలకులు క్రికెట్‌ జట్టుపై ప్రభావం చూపిస్తుంటే మన హైదరాబాద్‌ క్రికెట్‌ గొప్పతనం ఎలా తెలుస్తుంది. పాలకులపై కుప్పలుతెప్పలుగా ఏసీబీ కేసులున్నాయి. వాటిని దాచిపెట్టారు’ అంటూ రాసుకొచ్చాడు.

ఇటీవల జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అజహర్ తెరాసలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. మరీ.. ఇప్పుడు రాయుడు ఫిర్యాదుతో అజహర్ ప్యానల్ పై కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ? అనేది చూడాలి.