ముంబై టీ20 హైదరాబాద్ కు మార్పు

భారత్-వెండీస్ సిరీస్ డిసెంబర్ లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 6న భారత్‌-వెస్టిండీస్‌ల తొలి టీ20 ముంబైలో జరగాల్సివుంది. ఇప్పుడీ వేదిక మారింది. తొలి టీ20ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఇటీవల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్‌ అజహరుద్దీన్‌ విజ్ఞప్తి మేరకే ఈ మ్యాచ్ వేదిక మార్చినట్టు తెలుస్తోంది.

దీనిపై అజహర్ స్పందించారు. ‘విండీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. ఇది హెచ్‌సీఏలో నా అధ్యక్షతను మొదటి మ్యాచ్‌. క్రికెట్‌ అనేది ప్రతిరోజూ నేర్చుకునే గేమ్‌. క్రికెట్‌ అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్‌ సెక్యూరిటితో పాటు ప్రైవేట్‌ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపటి నుంచి మ్యాచ్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి’ అని అజహర్‌ తెలిపారు. హెచ్ సీఏపై అంబటి రాయుడు చేసిన ఆరోపణలపై అజహర్ స్పందించలేదు.