ప్రియాంకరెడ్డి హత్యకేసు నిందితుల ఫోటోలు రిలీజ్ 

వెటర్నరి డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్య అందరినీ కలిచి వేస్తోంది. మొన్న తహసిల్దార్ విజయారెడ్డి హత్య, ఇప్పుడు ప్రియాంకరెడ్డి దారుణ హత్య నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రియాంకని అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులు యువకులే. అంతా 25యేళ్లలోపు వాళ్లే. వారిలో మైనర్లు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా నిందితుల ఫోటోలు బయటికొచ్చాయి. నిందితులు మొత్తం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

మహ్మద్ పాషా అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. ఇతడు నారాయణ పేట్ మండలం మహబూబ్‌నగర్ వాసి. అతడిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురు జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులుగా గుర్తింపు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లిన నిందితులు అక్కడే అత్యాచారం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియాంకరెడ్డిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. కిరోసిన్ పోసి ప్రియాంకను దహనం చేశారని.. 70 శాతం ప్రియాంక మృతదేహం కాలిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. మరికొద్దిసేపట్లో నిందితులని మీడియా ముందు హాజరుపరచనున్నారు.

ప్రియాంక రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ పాషాతో పోలీసులు తీసుకెళ్లినట్లు ఆయన తల్లి వెల్లడించింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు పాషాను పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు. ఐదేళ్ల నుంచి తన కుమారుడు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు తీసుకెళ్లారని పాషా తల్లి తెలిపింది.