తహసీల్దార్‌ విజయారెడ్డి అటెండర్ మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన ఘటన అందరినీ కలిచి వేసింది. డ్యూటీలో ఉన్న విజయారెడ్దిపై నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. నిందితుడు సురేష్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించి గాయాలపాలైన ఆమె డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ఘటనలో మరొకరు మృతి చెందారు. కంచన్‌బాగ్‌ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కార్యాలయ అటెండర్‌ చంద్రయ్య తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారు జామున గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విజయారెడ్డి కాలిపోతున్న సమయంలో ఆమెను కాపాడబోయి చంద్రయ్య గాయాలపాలయ్యారు. అప్పటి నుంచి డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క సారిగా గుండె పోటు రావడంతో చంద్రయ్య మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

చంద్రయ్య మృతితో ఈ ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. తహసిల్దార్ విజయారెడ్ది, ఆమె డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య, నిందితుడు సురేష్ మృతి చెందారు. సురేష్ క్షణికావేశానికి అతడితో పాటు మరో మూడు నిండిప్రాణాలు బలైపోయాయి.