మహేష్ గ్యాంగ్‌స్టర్‌ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫిక్సయింది. వీరి కలయికలో వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ హిటైన సంగతి తెలిసిందే. అంతకుమించి.. మహర్షి మహేష్ ని మురిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకొన్నాడు మహేశ్. పబ్లిక్ గానే కాలరెగిరేశాడు. ఒకటికాదు రెండు సార్లు చేశాడు.
 
ఈ నేపథ్యంలోనే మహేష్-వంశీ కాంబోలో రాబోతున్న రెండో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడట.  గతంలో మహేశ్ ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాల్లో మాఫియా నేపథ్యం ఉన్న యువకుడిలా కనిపించాడు. వీటిలో పోకిరి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ట్రెండ్ సెట్ చేసింది. మహేష్ ని స్టార్ ని చేసిన సినిమా ఇది. ఇక బిజినెస్ మేన్ కమర్షియల్ గా బాగానే ఆడింది. ఈ రెండు చిత్రాలకి పూరి జగన్నాథ్ దర్శకుడు.

ఇప్పుడు వంశీపైడిపల్లి కూడా మహేష్ ని గ్యాంగ్ స్టర్ గా మార్చబోతున్నాడు. కథ-కథనాలు కొత్తగా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారంట. వంశీపైడిపల్లి సినిమా.. అంటే చెక్కుడు మాములుగా ఉండదు. కథని చెక్కడానికి ఓ యేడాది.. సినిమాని తీయడానికి ఓ యేడాది తీసుకొంటారాయన. ఇప్పటికే మహేష్ కోసం గ్యాంగ్ స్టర్ కథని చెక్కడం అయిపోయిందట. ఇక మిగిలింది సినిమాని చెక్కడమే అంటున్నారు.