అభిమానికి ‘రంగస్థలం అవార్డు’ అంకితం

మెగా ఫ్యామిలీ వీరాభిమాని నూర్ భాయ్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో మెగా హీరోలు తీవ్ర బాధలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ నూర్ భాయ్ ఇంటికి వెళ్లి సంతాపాన్ని తెలిపారు. ఆ సమయంలో అందుబాటులో లేని రామ్ చరణ్ నూర్ భాయ్ మృతిపట్ల ట్విట్టర్ వేదిక విచారం వ్యక్తం చేశారు.

నూర్ భాయ్ పై ఉన్న ప్రేమని తెలిపారు. అంతేకాదు.. తక్షణ సాయంగా నూర్ భాయ్ కుటుంబానికి రూ.10లక్షల ఆర్తికసాయాన్ని ప్రకటించారు. అక్కడితో రామ్ చరణ్ కి అభిమాని మీద ప్రేమ ఆగిపోలేదు. నూర్ భాయ్ కి రంగస్థలం సినిమాకి వచ్చిన అవార్డుని అంకితమిచ్చారు. రంగస్థలం చిత్రంలో నటనకు గాను ‘బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్’ పురస్కారం లభించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చరణ్ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చరణ్.. ఈ అవార్డుని అభిమాని నూర్ భాయ్ కి అంకిమిస్తున్నట్టు ప్రకటించారు. నూర్ భాయ్ గొప్ప వ్యక్తి. తనని, తన తండ్రి మెగాస్టార్ ని ఎంతో అభిమానిస్తూ, ప్రోత్సహించేవారని.. ఇప్పుడు ఆయన మన మధ్యలేరని, తనకు అవార్డు నూర్ ఇచ్చినట్టే అనిపిస్తోందని చరణ్ అన్నారు. మేం మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాం సర్.. మిమ్మల్ని మిస్సవుతున్నాం అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.