10నిమిషాల్లో 2 ట్యూన్స్.. దట్ ఈజ్ ఇళయరాజా !

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాలో పదను ఇంకా తగ్గలేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ఉదయం పాటల సిట్టింగ్స్ కోసం కృష్ణవంశీ ఇళయరాజా దగ్గరికి వెళ్లాడు. సినిమాలో పాటలు వచ్చే సందర్భాన్ని వివరించారు. ఇలా.. వంశీ సందర్భం చెప్పాడో లేదో.. అలా రెండు ట్యూన్స్ ఇచ్చేశాడట ఇళయరాజా. కేవలం 10 నిమిషాల్లో 2 ట్యూన్స్ ఇచ్చారని.. అది ఒక్క ఇళయరాజాకే సాధ్యమని వంశీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. పాట వచ్చే సందర్భాలు బాగున్నాయని ఇళయరాజా మెచ్చుకున్నట్టు వంశీ తెలిపారు.

ఇక వరుస ప్లాపుల్లో ఉన్న కృష్ణవంశీ రంగమార్తాండతో హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్ అనసూయ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే యేడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయి. మరీ.. ఈసారైన కృష్ణవంశీ తనమార్క్ ని చూపిస్తాడేమో చూడాలి.