‘మత్తు వదలరా’పై ప్రభాస్ స్పెషల్ వీడియో

ప్రేక్షకులకి పట్టిన రొటీన్ సినిమాల మత్తుని వదిలించింది ‘మత్తు వదలరా’ సినిమా. కీరవాణి చిన్నకొడుకు శ్రీ సింహా హీరోగా, పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రానికి రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.

పాటలు లేవు, హీరోయిన్ ప్రస్తావన లేని.. ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగిన ఈ కథకి ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. ఇప్పటికే మత్తు వదలరా చిత్రబృందంతో రాజ‌మౌళి ఆదివారం చిట్ చాట్ చేశాడు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మత్తు వదలరా సినిమా చూశాడు. సినిమా బాగుందని చిత్రబృందాన్ని ప్రశంసించారు. అంతేకాదు.. చిత్రబృందంతో ప్రభాస్ చేసిన చిట్ చాట్ వీడియోని మంగళవారం విడుదల చేయనున్నారు. మొత్తానికి.. రిలీజ్ ముందు తక్కువ ప్రచారం లభించిన మత్తు వదలరా చిత్రానికి రిలీజ్ తర్వాత మాత్రం బాగా ప్రచారం చేస్తున్నారు. కేవలం రూ. 2కోట్లతో తెరకెక్కిన చిత్రమిది.