సుజనా గాలి తీసేశారు

ఏపీ రాజధాని అంశంపై బీజేపీపై భిన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం జగన్ ఇష్టమొచ్చినట్లు రాజధానిని మారిస్తే కేంద్రం చూస్తు ఊరుకోదు. కేంద్రంతో మాట్లాడిన తర్వాతే ఈ విషయం చెబుతున్నా. రాజధానిని మార్చటం సాధ్యంకాదని సుజనా బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుజనా ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మరో బీజేపీ ఎంపీ జీవీఎల్ మీడియా ముందుకు వచ్చారు. సుజనా గాలి తీసేశారు. ఇంతకీ జీవీఎల్ ఏమన్నారంటే ?

రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఉండదు. ఏదైనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాలు అడిగితే కేంద్రం ఇస్తుందని,రాజధాని తరలింపుపై ఎవరు మాట్లాడినా అది వాళ్ళ వ్యక్తిగతమైన వ్యాఖ్యలే కానీ పార్టీకి, కేంద్రప్రభుత్వానికి సంబంధం లేదన్నారు జీవీఎల్. అంతేకాదు.. పార్టీ జాతీయ విధానాలపై తాను మాత్రమే మీడియాతో మాట్లాడుతానని కూడా జీవిఎల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో ఎంపీ సుజనా గాలి తీసేసినట్టయింది. సుజనా ఒక్కరి గాలి మాత్రమే కాదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ, ఆయనకి సపోర్టు చేస్తున్న సీఎం రమేష్ లాంటోళ్ల గాలి కూడా పోయిందని చెప్పాలి.