టికెట్ దక్కదని తెరాస నేత ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఆశావాహులు టికెట్ దక్కించుకొనేందుకు మంత్రుల ఇంటివద్ద పడిగాపులు గాస్తున్నారు. ఐతే, తనకు టికెట్ దక్కే అవకాశం లేదని టీఆర్ఎస్ ఆశావహుడు పెట్రోలు పోసుకుని హల్‌చల్ చేశాడు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది.

మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు.
వీరంతా పార్టీ టికెట్ కోసం మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయిన్‌పల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి తన కార్యాలయంలో టికెట్లు ఇచ్చే విషయంలో చర్చలు జరుపుతున్నారు. అంతలోనే ఓ వ్యక్తి తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని మనస్తాపానికి గురయ్యాడు. ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు.