రెబల్స్’కి సీఎం కేసీఆర్ హామీ

తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే, నియోజవర్గ ఇన్ ఛార్జులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామన్నారు.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉంది. టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు.. రెబల్స్ కి సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

బుధవారమే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి.