ప్యాన్ ఇండియా సినిమాపై మహేష్ క్లారిటీ

టాలీవుడ్ స్టార్స్ ప్యాన్ ఇండియా సినిమాపై ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’పై ప్లాప్ టాక్ వచ్చినా.. బాలీవుడ్ లో రూ. 150కోట్లు కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాపై టాలీవుడ్ స్టార్స్ కి మరింత మోజు పెరిగింది.

గత యేడాది టాలీవుడ్ నుంచి సాహో, సైరా లాంటి ప్యాన్ ఇండియా సినిమాలొచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “ఆర్ఆర్ఆర్” సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ లు కూడా ప్యాన్ ఇండియా సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే మహేశ్ ప్యాన్ ఇండియా సినిమాని సెట్ చేసుకొన్నారనే ప్రచారం జరిగింది.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఒకే అయింది. ఈ యేడాదియే ఆ సినిమా ఉండబోతుందనే వార్తలొచ్చాయ్. ఈ వార్తలపై సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి సినిమా వంశీపైడి పల్లి దర్శకత్వంలోనే ఉండనుంది. వేసవిలో సినిమా ప్రారంభం కానుంది. కేజీఎఫ్ దర్శకుడు కథలు వినిపించిన మాట నిజమే. కానీ, ఇంకా సినిమా సెట్ కాలేదని తెలిపారు. దీంతో మహేష్ ప్యాన్ ఇండియా సినిమాపై క్లారిటీ ఇచ్చినట్టయింది.