బోయపాటికి బన్నీ పరామర్శ

దర్శకుడు బోయపాటి శ్రీనుకి మాతృ వియోగం కలిగిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ(80) కన్నుమూశారు. బోయపాటి స్వస్థలం గుంటూరు జిల్లా పెదకాకానిలో సీతారావమ్మ అంత్యక్రియలు జరిగాయి. ప్రస్తుతం బోయపాటి సొంతింటి వద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు గుంటూరు వెళ్లి బోయపాటి పరామర్శిస్తున్నారు. గురువారం స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గుంటూరు వెళ్లి బోయపాటిని కలిశారు.

బుధవారం అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ విజయవాడలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీ విజయవాడ వెళ్లారు. అక్కడ నుంచే బన్నీ గుంటూరు వెళ్లి బోయపాటిని పరామర్శించినట్టు తెలుస్తోంది. ఇక బోయపాటి-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘సరైనోడు’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మాస్ ఎంటర్ టైనర్ మెగా అభిమానులని బాగా ఆకట్టుకుంది. ఏకంగా రూ. 100కోట్లపైగా వసూలు చేసింది.