తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 71.41% పోలింగ్‌

ఒకట్రెండు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తప్ప తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు  ప్రశాంతంగా ముగిశాయి. 71.41 శాతం పోలింగ్‌ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక సంస్థల్లో 74.73 శాతం, 9 నగరపాలక సంస్థల్లో 58.86 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. కామారెడ్డి పురపాలిక పరిధిలోని ఒక వార్డులో రీ పోలింగ్‌కు అవకాశమున్నట్లు తెలుస్తోంది. 41వ వార్డులోని 101వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదైంది. ఒక్క టెండర్‌ ఓటు పడినా రీపోలింగ్‌ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే తెలిపింది. ఈ నెల 24వ తేదీన అక్కడ రీపోలింగ్‌ జరిగే అవకాశం ఉంది.