ఘనంగా గణతంత్ర వేడుకలు

దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లిలో రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సొనారో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. 16 రాష్ట్రాలు, 6 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తున్నారు.

ఢిల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహించింది. వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఇక హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఏపీ శాసనసభ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో స్పీకర్‌ తమ్మినేని పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.  తెలంగాణ అసెంబ్లి ప్రాంగణంలో రిపబ్లిక్‌డే వేడుకలు జరిగాయి. వేడుకల్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ హైకోర్టులో గణతంత్ర వేడుకలు జరిగాయి. వేడుకల్లో హైకోర్టు సీజే జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.