భాజపాతో కాంగ్రెస్‌ కలవడంపై వీహెచ్‌ సీరియస్

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో పలుచోట్ల విజయం సాధించేందుకు భాజపాతో కాంగ్రెస్‌ కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయం కోసం కాంగ్రెస్ ఇంతలా దిగజారిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సీరియస్ అయ్యారు. భాజపాపై నిత్యం పోరాటం చేయాల్సిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయడమేంటని వీహెచ్ నిలదీశారు.

గురువారం గాంధీభవన్‌లో వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పలుచోట్ల విజయం సాధించేందుకు భాజపాతో కాంగ్రెస్‌ కలవడం దారుణమని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అవలంబిస్తున్న ఇలాంటి విధానాలతో నిత్యం ఆర్ఎస్‌ఎస్‌, భాజపా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో ముస్లింలు పార్టీకి దూరం అయ్యే అవకాశాలున్నాయన్నారు.