వారికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి 

నూతన క్రికెట్‌ సలహా కమిటీ (అడ్వైజరీ కమిటీ)ని బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌ (ఆర్పీ సింగ్), సులక్షణ నాయక్‌ లకి చోటు కల్పించారు. దీంతో బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. చీఫ్ సెలక్టర్ పోస్ట్ కోసం మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివ రామకృష్ణన్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్ , నయన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అబే కురువిల్లా పోటీలో నిలిచారు.

ఐతే, అభ్యర్థుల్లో అత్యంత సీనియర్  లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నట్టు తెలుస్తోంది.లక్ష్మణ్ శివ రామకృష్ణన్ అత్యంత అనుభవశాలి. 1983లో ఆయన అరంగేట్రం చేశారు. కానీ ఆడిన టెస్టులు తక్కువ. వెంకటేశ్ ప్రసాద్ (33 టెస్టులు), అగార్కర్ (26 టెస్టులు) ఎక్కువ మ్యాచులు ఆడారు. మరీ.. వీరిలో ఎవరికి బీసీసీ చీఫ్ సెలక్టర్ పోస్ట్ దక్కనుంది అన్నది ఆసక్తిగా మారింది.