ప్రతిసారి సిక్స్ కొట్టాలనే దిగుతా : విజయ్ దేవరకొండ 


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ఒక్క హీరోయిన్ ఉంటేనే రచ్చ రచ్చ చేస్తాడు. ఆయన ఈసారి ఏకంగా నలుగురు హీరోయిన్లతో కలిసి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా వస్తున్నాడు. విజయ్‌ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్‌, కేథరిన్‌, ఇజబెల్‌ లైట్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కేఎస్‌ రామారావు నిర్మించారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి14 కానుకగా ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌ లో వరల్డ్ ఫేమస్ లవ్వర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే.. ఆకట్టుకొనే స్పీచ్ ఇచ్చారు.

“ఇది నా తొమ్మిదో సినిమా. నాలుగేళ్లలో చాలా చూశాను. హిట్లు కొట్టా.. కొద్దిలో చేజారిపోయిన సినిమాలున్నాయి. ఈ జర్నీలో రెండే రెండు తటస్థంగా ఉన్నాయి. అందులో మొదటిది మీరు. నాలుగేళ్లుగా మీరు నాతోనే ఉన్నారు. రెండోది నేను.. ఏది చేసినా సిక్సు కొట్టాలనే దిగుతా.. సింగిల్స్‌, డబుల్స్‌ తీసే ఓపిక నాకు లేదు. ‘అర్జున్‌ రెడ్డి’ చేసిన.. ఆ తర్వాత ‘మేడం మేడం’ అంటూ.. ‘గీత గోవిందం’ చేశా. తమిళం రాకున్నా భాష నేర్చుకొని ‘నోటా’ చేశా. ‘డియర్‌ కామ్రేడ్‌’ చేసి ఐదు రాష్ట్రాల్లో విడుదల చేశాం. అందులో కొన్ని స్టేడియం అవతల పడ్డాయ్‌. కొన్ని స్టేడియంలోనే పడ్డాయ్‌. నా కెరీర్‌లో ఇప్పటికే లవ్‌స్టోరీ సినిమాలు ఎక్కువైపోయాయి. అందుకే చివరిసారిగా ఎప్పుడూ తీయని ప్రేమకథ తీయాలని అనుకున్నాను. అదే టైంలో క్రాంతి మాధవ్‌.. నేను కోరుకున్న స్టోరీ తీసుకొచ్చాడు. అందుకే వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలో అన్ని రకాల లవ్‌స్టోరీలు కవర్‌ చేశాం. మూడు రకాల మనుషులు, మూడు రకాల ఆర్థిక స్థోమత గల మనుషులు, పల్లెటూరు, హైదరాబాద్‌, పారిస్‌ ఇలా.. మూడు రకాల ప్రేమకథలు చూపిస్తున్నాం. అయితే.. ఒక టీం గెలవాలంటే ఒక్కరే పోరాడితే సరిపోదు. అందరూ బాగా ఆడాలి. సినిమాలో నలుగురు హీరోయిన్లు వాళ్ల కెరీర్‌ బెస్ట్‌ చేశారు. సినిమా గొప్పతనం మొత్తం క్రాంతి మాధవ్‌కే దక్కుతుంది. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ బాగా పని చేశారు. షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాం. ఈ ఫిబ్రవరి 14న సినిమా చూసి మీరు కూడా తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. సినిమాతో మీరు ప్రేమలో పడతారని గ్యారంటీ ఇస్తున్నా” అన్నారు విజయ్ దేవరకొండ.