సినీ జర్నలిస్ట్ పసుపులేటి మృతిపై మెగాస్టార్ సంతాపం

సీనియర్ సినీ జర్నలిస్ట్ పసుపులేటి రామారామావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పసుపులేటి మృతిపై సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామారావు కుటుంబానికి అండగా ఉంటామని మెగాస్టార్ హామి ఇచ్చారు.

“గత కొంతకాలంగా రామారావు అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యం చేయించుకోమని చెప్పి ఆస్పత్రికి పంపాను. మోకాళ్ల ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. తన సోదరికి ఆరోగ్యం సరిగాలేదని, ఆమె కోలుకున్నాక చేయించుకుంటానని అన్నారు. నేనంటే ఆయనకి ఎంతో అభిమానం. నాకు కూడా అంతే. నీతి, నిజాయితీ, నిబద్ధతకు రామారావు ప్రతిరూపం. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అన్నారు చిరంజీవి.

పసుపులేటి రామారావు స్వస్థలం ఏలూరు. ఆయన మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేసారు. ఆ తర్వాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా కొంతకాలం పనిచేసారు. ప్రస్తుతం సురేష్ కొండేటి ‘సంతోషం’ సినీ పత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.