ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం కొత్త చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అన్నారం గ్రామానికి చెందిన సందీప్ (13), మహిపాల్ (13), సూరారం గ్రామానికి చెందిన పల్లవ్‌ కుమార్‌ (13) అన్నారం కేంద్రీయ విద్యాలయం-1లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అన్నారం కొత్త చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. 

ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన సందీప్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన మహిపాల్‌, పల్లవ్‌ కుమార్‌లు కూడా చెరువులో దూకి మునిగిపోయారు. దీన్ని గమనించిన మరో ముగ్గురు విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని వారు వచ్చి మునిగిన విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ముగ్గురు చిన్నారులు నీటిలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.