ట్రంప్’కి సీఎం కేసీఆర్ ఇచ్చే బహుమతులు ఇవే !

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మరికాసేపట్లో భారతగడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఆయన భారత్ లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఆయన తిరుగు ప్రయాణం అయ్యేవరకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ట్రంప్ భారత పర్యటనలో ఆయనకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందు ప్రత్యేకతలని సంతరించుకోనుంది. ఈ విందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది.
 
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాత్రి 8 గంటలకు సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అక్కడే అతిథులంతా కలిసి విందు ఆరగించబోతున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహుమతులు అందజేయనున్నారు. చార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపికను, పోచంపల్లి శాలువాను గిఫ్ట్స్ గా ఇవ్వబోతున్నారు. అంతేకాదు.. ట్రంప్ సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకాలకు పోచంపల్లి, గద్వాల పట్టు చీరలను బహుకరించబోతున్నారు. గతంలో ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆమెకి తెలంగాణ సంస్కృతి-సాంప్రదాయలపై ఓ ఐడియా ఉంది.