తొలిరోజు ముగిసిన ట్రంప్ పర్యటన

రెండ్రోజుల పర్యటనకి గానూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కి విచ్చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు పర్యటనలో ట్రంప్ బిజీ బిజీగా గడిపారు. సోమవారం ఉదయం అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రంప్‌, మెలానియా దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మహాత్మాగాంధీ చిత్ర పటానికి వస్త్రమాలను వేశారు. ట్రంప్‌, మెలానియా చరఖాను తిప్పారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసి సంతకం చేశారు.

అక్కడి నుంచి మోతెరా మైదానానికి చేరుకొని ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం విమానంలో ఆగ్రాకు బయల్దేరారు. తాజ్‌మహల్‌ అందాలను తిలకించిన ట్రంప్‌ దంపతులు.. ఆ పురాతన పాలరాతి కట్టడం విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందులో ట్రంప్ ఫ్యామిలీ పాల్గొననుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకి ట్రంప్ తిరిగి అమెరికాకి పయనం కానున్నారు.