కరోనాపై సీఎం కేసీఆర్ లాజిక్

కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. తెలంగాణలోనూ కరోనా కలవరం మొదలైంది. ఇక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం అతడిని గాంధీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కరోనాపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనాపై స్పందించారు. కరోనా రావొద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. రాష్ట్రానికి కరోనా వైరస్‌ రాదు. రానివ్వం కూడా. ఈ వైరస్‌ ఇక్కడ పుట్టినది కాదు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. ఈ 31 మంది కూడా దుబాయ్‌, ఇటలీ పోయి వచ్చినా వారేనని సీఎం తెలిపారు.

ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామన్నారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాంటప్పుడు ఆ వైరస్‌ ఇక్కడ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. కరోనాపై అసత్య ప్రచారాలు చేయొద్దని సూచించారు.