రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌజ్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను ఎగరవేసి.. చిత్రీకరించారన్న ఆరోపణలతో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌తో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది.

రేవంత్‌ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టారని రేవంత్‌ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కూకట్‌పల్లి 16వ మేజిస్ట్రేట్‌ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ దొరుకుతుందా ? అన్నది రేపు తేలనుంది. చాలా కీలక సమయంలో రేవంత్ రెడ్డి సమస్యలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. త్వరలో తెలంగాణ పీసీసీ చీఫ్ మారనున్నాడు. ఈ పదవి రేసులో రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.