వుహాన్‌ లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

ప్రసుతం ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని  వుహాన్‌ లో పుట్టింది. అక్కడి నుంచి చైనాను అతలాకుతలం చేసింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలని వణికించింది. కరోనా భయంతో 20 దేశాలు పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే, కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌లో పరిస్థితులు కుదుట పడ్డాయి. దీంతో అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. 76 రోజుల తర్వాత  వుహాన్‌ లో లాక్‌డౌన్‌ ఎత్తివేశారు.

వుహాన్‌లోని అతిపెద్ద మాంసపు మార్కెట్‌ కేంద్రంగా కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వెంటనే వీరి శాంపిల్స్‌ను లండన్‌ను పంపించి పరిశోధనలు చేపట్టారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ వైరస్‌ను ‘కరోనావైరస్‌’గా గుర్తించారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ ఈ నగరాన్ని అతలాకుతలం చేసింది. దీంతో వైరస్‌ని కట్టడి చెయ్యడానికి లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ మహమ్మారి ఇతర దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో మనదేశంలోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.