వారికి మెగాస్టార్ సెల్యూట్

లాక్ డౌన్ వేళ తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరుపై పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వారికి టాలీవుడ్ సెల్యూట్ చేస్తోంది. తెలంగాణ పోలీసుల పనితీరు పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ హీరో నాగ చైతన్య ఫిదా అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులకి సెల్యూట్ చేస్తూ మహేష్, చైతూ ట్విట్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు పట్ల ప్రశంసలు కురిపించారు. వారికి సెల్యూట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు.

 “రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మానీ, వారు పడుతున్నట్టువంటి ఈ కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ లో స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వలన లాక్ డౌన్ చాలా సక్సెస్ ఫుల్ గా జరిగిందని చెప్పాలి. అలా జరగబట్టే.. ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతిఒక్కరిని వేడుకుంటున్నాను. సామాన్యం జనం కూడా పోలీసులకి సహకరించాలి. ఈ కరోనాని తుది ముట్టించడం, అంతమొందించడంలో వారికి చేదోడు, వాదోడుగా మనం అందరం ఉండాలి. సహకరించాలి. పోలీసులు చేస్తున్నట్టువంటి ఈ అమోఘమైన పనికి పోలీస్ బిడ్డగా వారికి చేతులెత్తి  సెల్యూట్ చేస్తున్నాను. జై హింద్” అని చిరు పేర్కొన్నారు.

ఇక సినీ కార్మికులని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సిసిసి సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనికి భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. వాటితో నిత్యవసర సరుకులని కొనుగోలు చేశారు. ప్రస్తుతం వాటిని ప్యాక్ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే వాటిని నేరుగా సినీ కార్మికుల ఇంటికి తీసుకెళ్లి అందజేయనున్నారు.