ప్రధాని ప్రత్యేక ప్రకటనలు.. ఏంటీ ?

ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు.  ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగింపుపై ప్రధాని ప్రకటన చేయనున్నారు. వైరస్ నియంత్రణకు చర్యలు కొనసాగిస్తూనే… దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి, బడుగుజీవుల జీవనోపాధికి ఇబ్బందులు తొలగించడానికి ఆయన ప్రత్యేక ప్రకటనలు చేసే అవకాశముంది.

‘ప్రపంచం కంటే జీవితమే ముఖ్యం’ మార్చి 24న లాక్ డౌన్ ను ప్రకటించే సమయంలో ప్రధాని మోడీ అన్న మాటలివి. అయితే,  ఈనెల 11న ముఖ్యమంత్రులతో సమావేశం సందర్భంగా ‘ప్రాణంతో పాటు ప్రపంచమూ ముఖ్యమే’ అని ప్రధాని పేర్కొన్నారు. మారిన ప్రభుత్వ వైఖరికి అనుగుణంగానే ప్రధాని ప్రకటనలు చేసే వీలుంది. ప్రజా జీవనానికి ఇబ్బందుల్లేని రీతిలో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల ఆధారంగా రోజువారీ పనులకు వెసులుబాటు కల్పించొచ్చని చెబుతున్నారు.