కూతుళ్లని పరిచయం చేసిన సీనియర్ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ నదియా తన ఇద్దరు కూతుళ్లని అభిమానులకి పరిచయం చేసింది. కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. పెద్ద కూతురు సనమ్, చిన్న కూతురు జానా ముద్దుగా ఉన్నారు. ఫోటోలో వీరిద్దరికి సోదరిలా నదియా కనిపిస్తున్నారు. ఆమె అందం ఇప్పటికీ ఏమాత్రం తరగలేదు మరీ.. !

నదియా ఒకప్పటి టాప్ హీరోయిన్. 1985లో వచ్చిన ‘పూవ్ పూచుదవ’ అనే చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత రజనీకాంత్,  మోహన్ లాల్, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, సురేష్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. సినిమాల్లో బిజీగా ఉండగానే..1988 లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త శిరీష్ గాడ్ బోల్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైంది.

ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడిన నదియా మిర్చి చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. రీ ఎంట్రీలోనూ పవర్ ఫుల్ పాత్రలతో అదరగొడుతోంది.