విశాఖలో మరోసారి గ్యాస్ లీకు

విశాఖలో పరిస్థితులు ఇంకా అదుపులోనికి రాలేదు. గురువారం అర్థరాత్రి మరోసారి విశాఖ ఎల్ జీ పాలిమర్స్ సంస్థ నుంచి భారీ స్థాయిలో విషవాయువు లీకవుతోంది. పెద్ద ఎత్తున పొగలు బయటకు రావటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలరచేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు.

ఎన్ ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చేశారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో కొంతమంది వెళ్తుండగా.. చాలామంది కాలి నడకన సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు గ్యాస్ లీకేజి ప్రభావం లేకుండా చేసేందుకు గుజరాత్ నుంచి పారా టెర్షియరీ బ్యుటైల్ కెటెహాల్ (పీటీబీసీ) అనే ఈ రసాయనాన్ని తెప్పించి చల్లారు. అయితే తెప్పించిన రసాయం సరిపోలేదు. దీంతో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. మరింత రసాయనాన్ని తీసుకొచ్ఛే ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.