మహానగరాల్లో మాత్రమే లాక్ డౌన్ 5.O

కరోనా కట్టడి కోసం దేశంలో విడత వారీగా లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తూ వస్తున్నారు. అయితే లాక్ డౌన్ 4.ఓ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ని పొడగిస్తారా ? పొడగిస్తే ఎప్పటి వరకు పొడగిస్తారు ? అన్నది ఆసక్తిగా మారింది. ఈ నెల 31న ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ 5.ఓ పై ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది.

మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడగిస్తారని సమాచారమ్. ఐదో విడత లాక్ డౌన్ లో భాగంగా ప్రార్థనాస్థలాలకు, జిమ్ లకి అనుమతినిస్తారని చెబుతున్నారు. ఉత్సవాలు, విద్యా సంస్థలు, థియేటర్స్ ఎప్పటిలాగే మూసివేసే ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు లాక్ డౌన్ 5.ఓ ని కేవలం మహానగరాలకి మాత్రమే పరిమితం చేయనున్నారు. దేశంలోని దాదాపు 11 మహానగరాల్లో మాత్రమే ఐదో విడత లాక్ డౌన్ ని విధించనున్నారు. మిగితా ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు ఉండవనే ప్రచారం కూడా ఉంది.

ముంబై, పూణె, జైపూర్, సూరత్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, థానే, ఇండోర్, బెంగళూరు సహా మొత్తం 11 నగరాల్లో లాక్‌డౌన్- కొనసాగనుంది. వీటి పైనే కేంద్రం ఎక్కువ పెట్టనుంది. ఇక 5 వ విడత లాక్ డౌన్ లోనూ కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చి రాష్ట్రాలకే పూర్తి స్వేచ్చ ఇవ్వనుందని తెలుస్తోంది. దాని వలన కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై రాష్ట్రాలు ఎక్కువ దృష్టి పెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఐదో విడత లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు రాబోతున్నాయ్. అవేంటీ ? ఎలా ఉండబోతున్నాయన్నది తెలియాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే.