సినీ ప్రముఖులతో తలసాని సమీక్ష

సినీ ప్రముఖులతో మంత్రి తలసారి సమీక్ష నిర్వహించారు. మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి సమావేశమయ్యారు. నిర్మాతలు సి. కల్యాణ్‌, దిల్‌రాజు, దర్శకుడు ఎన్‌. శంకర్‌, మా అధ్యక్షుడు నరేష్‌, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌ రాంమోహన్‌రావు, జీవిత తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని “సినీ రంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. లాక్‌డౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు నిలిచిపోయి.. ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్‌లకు సంబంధించి తగు నిర్ణయాలు తీసుకుంటాం” అని అన్నారు.