గుడ్ న్యూస్ : 10రోజుల్లో రైతుబంధు సాయం

తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్. మరో పది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. నియంత్రిత పంటల సాగు అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించింది. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు అంగీకరించారు. దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం హర్షణీయం. రైతులు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతుబంధు సాయం అందించాలి. మరో పది రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేయాలి” అన్నారు.