కేసీఆర్ హడావుడిపై బండి ఫైర్

తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 40వేల కరోనా టెస్టులు మాత్రమే చేసింది. అయితే త్వరలో 50వేల కరోనా టెస్టులు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు, మరో నాలుగు జిల్లాల్లో కరోనా టెస్టులు చేస్తామని సీఎం అన్నారు.

దీనిపై తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కరోనా వైరస్‌ పరీక్షలపై కేంద్రం దృష్టి సారించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హడావుడి చర్యలు చేపట్టారని విమర్శించారు. మూడు నెలల్లో కేవలం 40వేల మందికి మాత్రమే పరీక్షలు చేశారని.. అలాంటిది ఇప్పుడు 50వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామనటం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల వారీగా కాకుండా జిల్లాల వారీగా పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.