మళ్లీ తెరపైకి దాసరి కొడుకుల ఆస్తి వివాదం

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇండస్ట్రీలో ఏ చిన్ని సమస్య వచ్చినా.. పరిష్కరించేవారు. కానీ ఆయన ఇంటి సమస్యని పరిష్కరించకుండానే వెళ్లిపోయారు. దాసరి తనయులు అరుణ్, ప్రభుల మధ్య ఆస్తి వివాదం చాన్నాళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే.

దాసరి చనిపోయిన సమయంలో అరుణ్, ప్రభుల ఆస్తి వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. కానీ అది కొలిక్కి రాలేదు. తాజాగా మరోసారి ప్రభు, అరుణ్ లు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి దాసరి అరుణ్ ప్రభు ఇంట్లోకి గోడ దూకి వచ్చాడట. ప్రభుని, అతని భార్యని తీవ్రంగా తిట్టారట.

దీనిపై ప్రభు జూబ్లీ హీల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఇండస్ట్రీ పెద్దలు మోహన్ బాబు, సి కల్యాణ్, మురళీ మోహన్ తదితరులు కల్పించుకుని తమ ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు కోరారు. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు తన తండ్రి దాసరి తన  కూతురు పేరిట గిఫ్ట్ గా ఇచ్చారని ప్రభు చెబుతున్నారు. దానికి అరుణ్ అంగీకరించడం లేదు. అక్కడే అసలు పంచాయతీ వచ్చిందని తెలుస్తోంది.