దూకుడు పెంచిన రాజు.. ఈరోజు ఢిల్లీకి !

వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు ఏపీసోడ్ కొత్త టర్న్ తీసుకుంది. రాజుని వదులుకోవడంతోనో లేక ఆయన్ని బుజ్జగిజ్జడంతోనే ఈ ఏపీసోడ్ కి తెరపడుతుంది అనుకున్నారు. కానీ, రాజు వైసీపీ కుంభస్థలంపైనే కొట్టారు. తనకి షోకాజ్ నోటీసులు ఇచ్చిన పార్టీ పుట్టుక, పేరునే ఆయన ప్రశ్నించారు.

వైఎస్ఆర్సీపీ పేరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీనా ? లేక యువజన రైతు కాంగ్రెస్ పార్టీనా ? అని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు ఎన్నికల సంఘం వద్ద ప్రాంతీయపార్టీగా గుర్తింపు ఉన్న పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు ? జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎంపీ విజయసాయి రెడ్డి తనకి షోకాజ్ నోటీసులు ఎలా పంపిస్తారు ? అని ప్రశ్నించారు రఘు రామకృష్ణ రాజు.

దీనిపై హాట్ హాట్ చర్చ జరుగుతుండగానే రఘు రామకృష్ణం రాజు ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌, హోంశాఖ అధికారులను కలిసే అవకాశముందని సమాచారం. నియోజకవర్గ పర్యటన సందర్భంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఎంపీ విజ్ఞప్తిని స్పీకర్‌ అదే రోజు హోంశాఖ కార్యదర్శికి పంపించారు. రఘురామకృష్ణమరాజు ఇవాళ స్పీకర్‌ను కూడా కలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ ఉనికినే దేశ రాజధాని ఢిల్లీలో రఘురామ కృష్ణం రాజుప్రశ్నించే అవకాశం ఉంది.