జపాన్‌లో వరదలు : 58 మంది మృతి

జపాన్ లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతూ ఇళ్లు, రోడ్లను నాశనం చేస్తున్నాయి. ఈ వరదల ప్రభావంతో ఇప్పటికే 58 మంది మృత్యువాతపడ్డట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో ఎక్కువగా కుమమోటో ప్రాంతంలోనే మరణాలు సంభవించినట్లు తెలిపింది. భారీ వరదలతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన నగావోలోని కొండచెరియలు విరిగిపడి సుందర పర్వత మార్గాలు దెబ్బతిన్నాయి.

గెరో నగరం ద్వారా ప్రవహించే నదులు వంతెనలకు ఆనుకొని ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంతం మొత్తం నీటమునిగింది. దీంతో వేల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. భారీవర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. దాదాపు 36లక్షల మంది నిర్వాసితులకు నివాస ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.