వికాస్ దూబే ఎన్‌కౌంటర్.. పక్కా ప్లాన్ ?

చట్టాలు ఎవ్వరికీ చుట్టాలు కావు. కానీ భారత చట్టాల్లోని లొసుగులని ఆసరా చేసుకొని నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. లింకర్ కింగ్ విజయ మాల్యానే ఇందుకు ఉదాహరణ. ఇక దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ ఘటన నిందితులకి శిక్ష పడటానికి దాదాపు 8యేళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో భారత పోలీసులు కూడా తెలివికి వచ్చేశారు.

చట్టాలని ఫాలో అవుతున్నే.. తమకి ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నారు. కరుడుగట్టిన నిందితులు దొరికిన కేసుల్లో ఎన్‌కౌంటర్ ని ఆశ్రయిస్తున్నారు. తెలంగాణలో దిశ నిందితులని వారం తిరక్కుండానే ఎన్‌కౌంటర్ చేయడంపై సర్వత్రా ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయనుకోండి. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ కూడా పక్కా ప్లాన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

8 మంది పోలీసులని కాల్చి చంపిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేని గురువారమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయమే ఎన్‌కౌంటర్ చేశారు. అయితే ఇది కావాలని చేయలేదు. ఆయన్ని యూపీ నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తాపడింది. దీంతో వికాస్‌దూబే పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఉదయం 6:30 గంటలకి ఈ ఘటన జరిగింది. ఇది పక్కా ప్లానింగ్ ఎన్‌కౌంటర్ అనే ప్రచారం జరుగుతోంది. అయినా పర్వాలేదు. ఈ గ్యాంగ్ స్టర్ ని ప్రజాధనంతో యేళ్లకి యేళ్లు జైల్ లో మేపడ కంటే.. ఇలా వేసేయడమే కరెక్ట్ అని నెటిజన్స్ అంటున్నారు.