తెలంగాణలో 1,524 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,524 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 37,745కి చేరింది. కరోనా బారిన పడి ఈ ఒక్క రోజే 10 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 375కి చేరింది. ఇవాళ 1,161 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 24,840గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,531 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 815 కొత్త కేసులు నమోదవ్వగా రంగారెడ్డిలో 240, మేడ్చల్‌లో 97, సంగారెడ్డిలొ 61, నల్గొండలో 38కేసులు నమోదయ్యాయి. కేసులు అధికంగా వచ్చిన చోట కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తోంది బల్దియా.లోకేశ్‌కుమార్ కేసులు వచ్చిన సర్కిళ్ల బాధ్యతలను అడిషనల్ కమిషనర్లకు అప్పగించారు.

శేరిలింగంపల్లి జోన్‌ లోని యూసుఫ్ గూడకు అడిషనల్ కమిషనర్ యాదగిరికి ఇన్‌ఛార్జి గా బాధ్యతలు అప్పగించారు. సికింద్రాబాద్ జోన్‌ లోని అంబర్ పేట్ కు అడిషనల్ కమిషనర్ కేనేడీ, ఖైరతాబాద్ జోన్లోని మెహదీపట్నం కు అడిషనల్ కమిషనర్ శంకరయ్య, కార్వాన్కు జేసీ సంధ్య, చార్మినార్ జోన్ లోని చాంద్రాయణగుట్ట కు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, చార్మినార్ జోన్ లోని చార్మినార్కు అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్, చార్మినార్ జోన్ లోని రాజేంద్ర నగర్ కు అడిషనల్ కమిషనర్ సంతోష్, కూకట్‌పల్లి జోన్ లోని కుత్బుల్లాపూర్ కు ఇన్‌ఛార్జి గా ప్రియాంకను నియమిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.