తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆఖరి వార్నింగ్

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆఖరి వార్నింగ్ ఇచ్చింది. కరోనా టెస్టులు, మీడియా బులిటెన్ విషయంలో ఇదే ఫైనల్ వార్నింగ్. ఇకపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కరోనా విషయంలో ప్రభుత్వం చేసుకుంటున్న తప్పుడు ప్రచారాన్ని కూడా తప్పుడు పట్టింది. హైకోర్టు అభినందించిందని మీడియా బులెటిన్‌లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం చివాట్లు పెడుతుంటే.. అభినిందించిందని ప్రజలకు తప్పుదోవ పట్టిస్తారా ? అని చివాట్లు పెట్టింది.

కరోనా మీడియా బులెటిన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జిల్లాల వారీగా కరోనా కేసులు, ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలు, రాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే విషయాలను ఆయా జిల్లా కలెక్టర్లు వెల్లడించాలని సూచించింది. అంతేకాదు వైద్యారోగ్యశాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.  ఈ నెల 28న సీఎస్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా చికిత్స ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సప్‌ నంబరును విస్తృత ప్రచారం చేయాలని న్యాయస్థానం సూచించింది. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 45076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రం ప్రభుత్వం మొత్తం 17,081 బెడ్స్ అందుబాటులో ఉంచింది. ఇందులో 1900 బెడ్స్‌ ఆక్యుపై అయింది. 15,181 బెడ్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి.