ఆ నిరుపేద రైతుకి ట్రాక్టర్ కొనిచ్చిన సోనూసూద్

నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. మాటిచ్చినట్టుగానే పేద రైతుకి ట్రాక్టర్ కొనిచ్చాడు. అది కూడా గంటల వ్యవధిలోనే. చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలం మహల్‌ రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో ఒకటి ఇటీవల బయటకొచ్చింది. కరోనా కష్టకాలంలో ఓ రైతు తన కుటుంబంతో కష్టపడుతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోపై స్పందించిన నటుడు సోనూసూద్.. ఈ పేద రైతుకి రేపు ఉదయానికల్లా ఎద్దులు కొనిస్తానని ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత ఎద్దులు కాదు. ట్రాక్టర్ కొనిస్తానని మాటిచ్చాడు. రైతులు దేశానికి గర్వకారణమని చెబుతూనే కుమార్తెల చదువులపై దృష్టి సారించాలని సదరు రైతును సోనూ కోరాడు. మాటిచ్చిన గంటల వ్యవధిలోనే ట్రాక్టర్ ని పేద రైతు ఇంటికి చేర్చాడు సోనూసూద్. ట్ట్రాక్టర్ తో పేదరైతు కుటుంబం దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమని ఆదుకున్న సోనూసూద్ కి రైతు థ్యాంక్స్ చెప్పారు.