ప్రైవేటు హాస్పటల్స్ కు తెలంగాణ ప్రభుత్వం ఝులక్

తెలంగాణలో ప్రయివేటు హాస్పటల్స్ కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా రోగుల నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఘటనలు వెలుగులోనికి వచ్చాయ్. హైకోర్టు కూడా కరోనా చికిత్స, ప్రయివేటు హాప్సటల్స్ లో చికిత్స పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు వచ్చిన ప్రయివేటు ఆసుపత్రులకు ప్రభుత్వం ఝులక్ ఇస్తోంది.

హైదరాబాద్ సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్ కు ఇచ్చిన కరోనా ట్రీట్‌మెంట్ పర్మిషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై కరో నా పేషెంట్లను అడ్మిట్ చేసుకోవద్దని ఆదేశించింది. కరోనా చికిత్స పేరుతో అనేక మంది రోగుల నుంచి డెక్కన్ ఆస్పత్రి లక్షల రూపాయల కొద్ది బిల్లులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, ఇష్టారాజ్యంగా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సర్కార్ ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆస్పత్రిపై వస్తున్న ఆరోపణలు నిజమని రుజువు కావడంతో ప్రభుత్వం ఇలా షాక్ ఇచ్చింది. అయితే కేవలం కరోనా చికిత్సను మాత్రమే నిలిపివేస్తూ.. మిగిలిన చికిత్సలకు యధావిధిగా అనుమతి ఇచ్చారు.