ప్రణబ్ ముఖర్జీ.. బతికుండగానే చంపేశారు !

సోషల్ మీడియా మరో హత్య చేసింది. గతంలో బతికుండగానే పలువురిని చంపేసింది సోషల్ మీడియా. ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసింది. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే చేసింది. ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయనకు సర్జరీ చేశారు. అదే సమయంలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఆయనను వెంటిలేటర్‌పై అత్యవసర వైద్య చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రణబ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.

మరోవైపు ప్రణబ్ కన్నుమూశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సందేశాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయన ఫొటోలను పెట్టి మరీ ఈ సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియాలో నకిలీ వార్తలు పుట్టుకొస్తున్నాయనడానికి ఇది నిదర్శనమని అభిజిత్ ముఖర్జీ అన్నారు.