మరో తెరాస ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో కరోనా బారిపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యుడు జాజాల సురేందర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల జిల్లాలోని రామారెడ్డి మండలంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకూ సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ తెలింది. కాగా,  ఇప్పటికే  ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్‌ బారి నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.

ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1763 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్.  దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 95700కి చేరింది.నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య719కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1789 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 73,991కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,990కి చేరింది.