అభిమానులకి నాని లేఖ

నేచురల్ స్టార్ నాని నటించిన 25వ చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. మరో కథానాయకుడిగా సుధీర్ బాబు నటించారు. నివేధా థామస్, అతిధి రావు హైదరి కథానాయకులు. ఈ థ్రిల్లర్ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. కానీ ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనే పరిస్థితులు లేకపోవడంతో ‘వి’ని ఓటీటీలో తీసుకొస్తున్నారు.

తాజాగా ‘వి’ ఓటీటీ రిలీజ్ డేటుని ఖరారు చేసింది చిత్రబ్రందం. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో ‘వి’ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అభిమానులకి ఓ లేఖని రాశారు నాని. “వేట మొదలైంది. ‘వి’ సెప్టెంబర్‌ 5న ప్రైమ్‌లో విడుదలవుతుంది”అని ట్వీట్‌ చేసిన నాని.. లేఖని జత చేశాడు.

“అభిమానులారా.. ఇప్పుడు ఉన్నవి సాధారణ పరిస్థితులు కావు. అందుకే ఎప్పటిలా థియేటర్‌లో సినిమాని ఎక్స్‌పీరియన్స్‌ చేయలేం. నా 25వ సినిమా చాలా ప్రత్యేకం. అలాగే అనేక కారణాల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. దీన్ని మరింత గుర్తిండిపోయేలా చేద్దాం. ఈ సెప్టెంబర్‌ 5న ‘వి’ విడుదల కాబోతుంది. గత 12 ఏళ్లుగా మీరు నాకోసం థియేటర్లకు వచ్చారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ధన్యవాదాలు చెప్పబోతున్నా. సినిమాపై మీ స్పందన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మరో విషయం.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు ‘టక్‌ జగదీష్‌’ వస్తాడు. ప్రమాణం చేస్తున్నా”అని నాని లేఖలో పేర్కొన్నారు.