ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతి

పేదలకి ఉచిత ఇళ్లపట్టాలు అందజేసే పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ కార్యక్రమానికి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్దాయి. మరోవైపు ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలుస్తున్నాయ్. తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు ఆవ భూముల సేకరణలో రూ. 500కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు సీఎస్ కు చంద్రబాబు లేఖ రాశారు.

ఆవ భూములు, చిత్తడి నేలల సేకరణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకమని చంద్రబాబు అన్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోరుకొండ మండలంలోని బూరుగుపూడిలో భూసేకరణే తీసుకుంటే.. 00ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించారన్న చంద్రబాబు.. ఎకరం రూ.45లక్షల చొప్పున రూ.270కోట్లు ఖర్చుచేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ముంపు భూములు మెరక చేయడానికి మరో రూ.250కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆవ భూముల్లోనే మొత్తం రూ.500కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు.

భూసేకరణ పరిహారం, పునరావాస చట్టం 2013కింద భారీ మొత్తం చెల్లింపు చేశారని చంద్రబాబు ఆరోపించారు. తక్కువ ధర చేసే భూములను ప్రభుత్వంతో ఎక్కువ ధరకు కొనిపించినందుకు వాటాల కోసం భూయజమానులపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ సరికొత్త అవినీతి పోకడలేనన్నారు. తెనాలి, వినుకొండ, కావలి, పాలకొల్లు, పెందుర్తి, చోడవరం, అద్దంకి, పెనమలూరు, అనేక నియోజకవర్గాలలో భూసేకరణలే ఈ వినూత్న అవినీతి పోకడలకు ప్రత్యక్ష సాక్ష్యాలని చంద్రబాబు అన్నారు.