కీసర తహసీల్దార్ వ్యవహారం : రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ?  

ఓ భూ వ్యవహారంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ 1.6కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు అంజిరెడ్డి కూడా అరెస్టయ్యారు. ఆయన ఇంట్లో ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ దొరికాయ్. దీంతో.. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి సంబంధం ఉంది. అంతేకాదు.. మేడ్చల్ జిల్లాల్లో ఇలాంటి భూ కుంభకోణాల్లో రేవంత్ ప్రమేయం ఉందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు.‌ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తన లెటర్‌హెడ్స్‌ లభించడంపై తప్పేముందన్న రేవంత్‌రెడ్డి.. అందులో ఉన్న సమాచారానికి, కీసర వ్యవహారానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. జరిగిన వ్యవహారంలో ఒక్క పైసా సంబంధమున్న శిక్షకు సిద్ధమని తెలిపారు.