బిగ్ బాస్ 4 : పెళ్లాం స్థానంలో మొగుడు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే హౌస్‌లోకి వెళ్లేవారి జాబితా ఖరారైంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందుగా వారందరికీ పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాను బిగ్ బాస్ 4లో పాల్గొంటున్నట్టు యువ నటుడు, గాయని గీతా మాధురి భర్త నందు చెప్పేశాడు.

“డార్లింగ్స్‌ నేను బిగ్‌బాస్‌లో ఉన్నా. అక్కడ మన రచ్చ మామూలుగా ఉండదు. మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ మీ ముందుకు వస్తుంది. మీ సహాయం కావాలి. మంగళవారం సాయంత్రం మరో అప్‌డేట్‌ ఇస్తా” అని పేర్కొన్నారు. నందు సతీమణి గీతామాధురి కూడా ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’లో పాల్గొన్నారు. చివరి వరకూ తీవ్ర పోటీ ఇచ్చిన ఆమె రన్నరప్‌గా నిలిచారు. ఇప్పుడు నందు బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం.

ఇక ఈసారి ‘బిగ్‌బాస్‌’లోకి వెళ్లేది వీరేనంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జాబితా ప్రకారం రఘు మాస్టర్‌, ఆయన భార్య ప్రణవి, మహాతల్లి, ఆమె భర్త సుశాంత్‌, హెచ్‌ఎంటీవీలో వ్యాఖ్యాత సుజాత, టిక్‌టాక్‌ స్టార్‌ అరియానా గ్లోరీ, మెహబూబ్‌ దిల్‌సే, సోహైల్‌ రియాన్‌, కరాటే కల్యాణి, లాస్య, నోయల్‌, యాంకర్‌ ప్రశాంతి, జబర్దస్త్‌ అవినాష్‌లు హౌస్‌లోకి వెళ్లనున్నారు.